Telugu NewsTelugu Special Stories

వలసల వరదలు – ఒడువని దుఃఖాలు

మానవ వలసలు ఒక ప్రమాదకర అంతర్జాతీయ సమస్యగా రోజు రోజుకు ప్రపంచ మానవాళిని వేధిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 2014 నుంచి నేటి వరకు కనీసం 70,000 మంది వలసదారులు తమ ప్రాణాలను కోల్పోయారని లేదా ఆచూకీ తెలియకుండా పోయిందని, వాస్తవానికి ఈ సంఖ్య అనేక రెట్లు అధికంగా ఉండవచ్చని అధ్యయనాలు స్పస్టంగా చేస్తున్నాయి. ఒక్కొక్క వలసదారుల మరణాలు ఒక్కో కుటుంబానికి తీరని వ్యథను మిగిల్చిందని గమనించాలి.

నేడు ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో మానవ వలసలు క్రమంగా పెరగడం రానున్న కాలంలో ఒక భయానక మానవీయ సంక్షోభంగా మారనుందని స్పష్టం చేస్తున్నారు. దేశాల మధ్య యుద్ధాలు, అంతర్గత ఘర్షనలు, విపత్తులు, వాతావరణ ప్రతికూల మార్పులు, నిరంకుశ పాలనలు, ఆహార అభద్రత, మానవీయ సంక్షోభాలు, ఆర్థిక అసమానతలు లాంటి పలు కారణాలు వలసదారుల సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. 

 2023లో ప్రపంచవ్యాప్తంగా వలసదారుల వేధనలు పెరగడం, వలసల వరదలు పారడం, వలసదారుల కన్నీటి తుఫానులు ప్రవహించడం చూసాం. ఇజ్రాయిల్‌ – పాలస్తీనా, ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధాలు, బంగ్లాదేశ్‌లో అంతర్గత రాజకీయ సంక్షోభం, ప్రకృతి విపత్తులు, ఆకలి కేకలు లాంటి కారణాలతో మానవ వలసల వరదలు పారడం, ఇరుగు పొరుగు దేశాల్లోకి లేదా సురక్షిత ప్రాంతాల్లోకి శరణార్థులుగా చేరడం, యుద్ధాలు లేదా అల్లరులతో ప్రాణాలు అరచేతుల్లా పెట్టుకొని ఇండ్లు వదిలి వలసదారులు పట్టడం చూసాం. వలసదారుల శ్రమ శక్తి, నైపుణ్య లక్షణాలు, ఆవిష్కరణ ఆలోచనలు,, ఔత్సాహిక ప్రవృత్తులు నేటి సమాజానికి ఎంతో ఉపకరిస్తాయని మరువరాదు. వలసదారులతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక ప్రగతి కనిపిస్తుందని, వారికి అవకాశాలు కల్పిస్తే సమాజాభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడతారని తెలుసు కోవాలి. 

 మిలియన్ల కొద్ది వలసదారుల తమ గృహాలను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు పరుగులు తీయడాన్ని ఒక అమానవీయ చర్యగా భావించిన ఐరాస సభ్య దేశాలు 2000 నుంచి ప్రతి ఏట 18 డిసెంబర్‌ రోజుల “ అంతర్జాతీయ వలసదారుల దినం లేదా ఇంటర్నేషనల్‌ మైగ్రంట్స్‌ డే” నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

వలసదారుల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనలకు సమాధానాలు, వారి దయనీయ పేదరికాలు, సమ్మిళిత అభివృద్ధి ఆశయాలు, వలసదారుల పరిరక్షణ పాలసీలు, వారి భద్రత, వారి శాంతి సురక్షలు, మానవీయ హక్కుల కల్పనలు, ఆకలి చావులను అడ్డుకోవడం, గౌరవంగా జీవించే హక్కులను కల్పించడం, స్వేచ్ఛను కలిపించడం, వివక్ష కోరల్లో చిక్కడం, హింసల పాలు కావడం, క్రూర మానవ అక్రమ రవాణా వలలో చిక్కడం, వారి అభిప్రాయాలు/కన్నీళ్లకు విలువ లేక పోవడం లాంటివి పలు అంశాలను చర్చించి సరైన సమాధానాలు వెతకడానికి ఈ వేదికలు ఉపకరిస్తున్నాయి.

అంతర్జాతీయ వలసదారుల దినం-2024 థీమ్‌గా “వలసదారుల సకారాత్మక పాత్రను, వారి హక్కులను కాపాడుదాం” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతోంది. వలసదారుల కుటుంబాలను కాపాడడం, వారి సురక్షకు గొడుగులు పట్టడం మనందరి కనీస ధర్మం అని తెలుసుకోవాలి. వలసదారుల శ్రమ దోపిడీ ఒక ప్రధాన సమస్యగా మారడం విచారకరం. 

భారత్‌లో అంతర్గత వలసలు:

 తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగం, వ్యవసాయరంగాలు, వ్యాపారాలు, నైపుణ్య రంగాల్లో బీహార్, యూపీ, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాలకు చెందిన ప్రజలు వలసలు రావడం చూస్తున్నాం. నిస్సహాయ పరిస్థితుల్లో కుటుంబాలు లేదా వ్యక్తులు పలు కారణాలతో తమ గృహాలను వదిలి ఇతర దేశాలకు లేదా ప్రాంతాలకు వెళ్లడాన్ని మానవ వలసలుగా పిలుస్తారు. భారత్‌ లాంటి దేశాల్లో పని, ఆహార భద్రత, పేదరికం లాంటి కారణాలతో పట్టణాలు లేదా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం చూస్తున్నాం. బలవంతంగా అయినా లేదా మరో దారి లేనపుడు వలసలు పెరుగుతున్నాయి.

ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, పర్యావరణ కారణాలతో భారతదేశంలో వలసలు కనిపిస్తున్నాయి. 2011 వివరాల ప్రకారం భారతదేశవ్యాప్తంగా 45.6 కోట్ల ప్రజలు ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు వలసలు వెళ్లారని, వీరిలో 54 శాతం మంది పట్టణాలకు వలసలు వెళ్లినట్లు తెలుస్తున్నది. యూపీ, బీహార్‌ లాంటి రాష్ట్రాల నుంచి దాదాపు 88 శాతం ఇతర రాష్ట్రాలకు వలసల వరదలు పారడం చూస్తున్నాం. 

 వలసదారుల సమస్య ఫలితంగా పౌర సమాజంపై సానుకూల, ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక, జనాభాపరమైన, సామాజిక, పర్యావరణ కోణాల్లో పలు సమస్యలు లేదా అనుకూల ఫలితాలు గమనించవచ్చు. మానవ హక్కులను కోల్పోవడం, సామాజిక అభద్రత, కనీస అవసరాల కొరత, గౌరవమైనా పని దొరక్కపోవడం, వైద్య ఆరోగ్య అభద్రత, కనీస వేతనాలు దోరక్కపోవడం, మురికి కూపాల్లో జీవనాలు లాంటి పలు సమస్యలు వలసదారులు వేధిస్తున్నాయి. వలసదారులు మనలాంటి సాధారణ మానవులే అని, వారికి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని తెలుసుకొని వారిని నవ సమాజంలో భాగంగా చూసుకుందాం, మానవీయ విలువలను కాపాడుదాం. 

Show More
Back to top button