
ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, జైసల్మేర్ నుండి ఇందిరా పాయింట్ వరకు దాదాపు 7516.70 కి.మీ.పొడవు కలిగిన విస్తారమైన తీర ప్రాంతం మన దేశం కలిగి ఉంది. ఈ తీర ప్రాంతం గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, రెండు కేంద్రపాలిత ప్రాంతాలయిన – డామన్ డయ్యూ, పుదుచ్చేరిలను తాకుతుంది. ఈ తీరప్రాంత భద్రతకు ఇండియన్ కోస్ట్ గార్డ్ ( భారతీయ తీర రక్షక దళం) బాధ్యత వహిస్తుంది. భారతదేశ తీర ప్రాంత సరిహద్దులు, ద్వీపాలతో పాటుగా, మన దేశ మత్స్యకారులకు రక్షణ కల్పించడంలో భారతీయ తీర రక్షక దళం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద కోస్ట్ గార్డ్.
ఇండియన్ కోస్ట్ గార్డ్ డే చరిత్ర:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత నావికాదళం దేశ సముద్ర సరిహద్దుల భద్రతకు బాధ్యత వహించింది. 1960వ దశకంలో, సముద్రం ద్వారా జరిగే వస్తువుల అక్రమ రవాణా భారతదేశ దేశీయ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చింది. సముద్రాల మీదుగా సాగే స్మగ్లింగ్ ప్రబలంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చింది. కస్టమ్స్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వంటి ప్రస్తుత సముద్ర ఏజెన్సీలకు ఈ పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కార్యకలాపాలను నియంత్రించే సామర్థ్యం లేదు. అలాగే ప్రాదేశిక జలాల్లో కూడా అక్రమ నాళాలను అడ్డగించే సామర్థ్యం కూడా లేదు.
ఈ సమస్యను పరిష్కరించడానికి నాగ్ చౌదరి కమిటీని 1970లో ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. ఆగస్టు 1971లో భారతదేశం యొక్క విస్తారమైన తీరప్రాంతంలో గస్తీ నిర్వహించాల్సిన అవసరాన్ని కమిటీ గుర్తించింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించేందుకు ఆఫ్షోర్ ఫిషింగ్ ఓడల రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో నిమగ్నమైన నౌకలను అడ్డుకునేందుకు సమర్థమైన, సుసంపన్నమైన దళాన్ని ఏర్పాటు చేసింది. ఆ సేవలను అందించడానికి అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది సంఖ్య, స్వభావాన్ని కూడా కమిటీ పరిశీలించింది.
ముంబయి (అప్పటి బొంబాయి) హైలో చమురును కనుగొనడం, అధిక-విలువైన ఆఫ్షోర్ ఇన్స్టాలేషన్ల అభివృద్ధి, భారతదేశ పారిశ్రామిక ఆర్థిక ప్రయోజనాలలో అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో రక్షణ విపత్తు ప్రతిస్పందన కోసం చర్యలు కూడా అవసరమైనందువల్ల ప్రభుత్వం స్మగ్లింగ్ ఇతర చట్టవిరుద్ధమైన సముద్ర కార్యకలాపాలను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న యంత్రాంగంలోని లోపాలను పరిశీలించడానికి భారతదేశ సముద్రాన్ని రక్షించే చర్యలను సూచించడానికి కె యాఫ్ రుస్తమ్జీ అధ్యక్షతన సెప్టెంబర్ 1974లో ఒక కమిటీని నియమించింది. 1975లో ఈ కమిటీ తన నివేదికలో మన సముద్ర ప్రాంతాల సాధారణ పర్యవేక్షణ పోలీసింగ్ కోసం కోస్ట్ గార్డ్ తరహా సంస్థను ఏర్పాటు చేయాలని గట్టిగా సిఫార్సు చేసింది.
1977లో భారత నావికా దళం నుండి బదిలీ చేయబడిన రెండు యుద్ధనౌకలు, ఐదు పెట్రోలింగ్ బోట్లతో కూడిన కోస్ట్గార్డ్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ విధంగా 01 ఫిబ్రవరి 1977 న భారత తీర రక్షక దళం ఉనికిలోకి వచ్చింది. భారత జలాలు, ప్రత్యేక ఆర్థిక మండలిలో నిఘా కోసం కేవలం ఏడు నౌకల బలంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ను 19 ఆగస్టు 1978న అప్పటి ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ అధికారికంగా ప్రారంభించారు. మొదటి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐయన్సిజి కుతార్ 1978లో భారత నావికాదళం నుండి ఇండియన్ కోస్ట్ గార్డ్కు బదిలీ చేయబడింది. ప్రస్తుతం 158 నౌకలు, 78 విమానాలు 13,954 మంది సిబ్బంది ఉన్నారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్ డే యొక్క ప్రాముఖ్యత:
ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క నినాదం “మేము రక్షిస్తాము”. మన దేశ సముద్ర సరిహద్దులను రక్షిస్తుంది. సముద్ర మార్గాలలో జరిగే అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రిస్తుంది. సముద్రంలో మత్స్యకారులను కాపాడుతుంది. అవసరమైనప్పుడు వారికి సహాయం చేస్తుంది. సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కూడా పనిచేస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తారు.
విజన్ – మిషన్
సముద్ర చట్టాలు, నిబంధనలను అమలు చేస్తుంది. స్మగ్లింగ్, అక్రమంగా చేపలు పట్టడం, ఇతర సముద్ర నేరాలను అరికడుతుంది. చమురు, ఇతర ఖనిజాలతో సహా మన సముద్రం ఆఫ్ షోర్ సంపదను తీవ్రవాదం, అక్రమ చొరబాట్లు నుండి రక్షిస్తుంది. ఆపదలో ఉన్న నావికులకు సహాయం చేస్తుంది.
సముద్రం, వేట, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలకు సంబంధించి సముద్ర చట్టాలను అమలు చేస్తుంది. సముద్ర పర్యావరణం, జీవావరణ శాస్త్రాన్ని సంరక్షించి అరుదైన జాతులను కాపాడుతుంది. శాస్త్రీయ డేటాను సేకరించి యుద్ధ సమయంలో నౌకాదళాన్ని బ్యాకప్ చేస్తుంది. స్మగ్లింగ్ వ్యతిరేక కార్యకలాపాలలో కస్టమ్స్ శాఖ, ఇతర అధికారులకు సహాయం చేస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రస్తుతం 10 ఎయిర్ ఎన్క్లేవ్లతో 5 ఎయిర్ స్టేషన్లను కలిగి ఉంది. అలాగే దేశవ్యాప్తంగా మొత్తం 42 కోస్టల్ లైన్ స్టేషన్లను కలిగి ఉంది. భారతదేశ తీర ప్రాంతం మొత్తం 7516.60 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత మార్గంలో ఉంది మరియు ఇది అన్నింటిలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటిగా మారింది. ప్రారంభం నుండి నేటి వరకు సముద్రంలో సుమారు 11,561 మంది ప్రాణాలును కాపాడింది. సముద్రంలో స్మగ్లింగ్ నిరోధక మాదకద్రవ్యాల నియంత్రణలో పాల్గొని 2023లో 478 కోట్లతో కలిపి 15343 కోట్ల రూపాయల విలువైన నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకుంది.