రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. దీంతో చాలామంది శివ భక్తులు తీర్ధయాత్రకు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తుంటారు. మీరు అందులో ఒకరైతే త్రయంబకేశ్వర్ యాత్ర మీకు సరైనది. ఈ యాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వరాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వరం, నాసిక్, షిర్డీ కలిపి 4 రోజుల టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి టూర్ వెళ్లాలనుకుంటే.. ముందుగా హైదరాబాద్ నుంచి షిర్డీకి బస్సులో గాని, ట్రెయిన్లో లేదా విమానంలో వెళ్లాలి.
ఎంచుకున్న రవాణా బట్టి ప్రయాణ సమయం పడుతుంది. షిర్డీ వెళ్లిన తర్వాత అక్కడ సాయి బాబాను దర్శించుకుని.. హనుమాన్ టెంపుల్ దర్శించుకోవచ్చు. ఆ తర్వాత నాసిక్ వెళ్లవచ్చు. షీర్డి నుంచి నాసిక్కి దాదాపు 93 కి.మీ దూరం ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి బస్సు, క్యాబ్ అందుబాటులో ఉంటాయి. నాసిక్లో కాలరామ్ మందిర్, ముక్తిదామ్ మందిర్, సీత గుఫా మొదలైనవి దర్శించుకోవచ్చు. వీటన్నిటికి ఒక రోజు పడుతుంది.
మరుసటి రోజు నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్కు వెళ్లవచ్చు. నాసిక్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. దీని ఛార్జీ రూ.50 వరకు ఉంటుంది. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్కు దాదాపు 30 కి.మీ దూరం ఉంటుంది. ఈ ప్రయాణం దాదాపు ఒక గంట సేపు పడుతుంది. అక్కడ త్రయంబకేశ్వర ఆలయం, గంగ ద్వారం మొదలగు స్థలాలను దర్శించుకోవచ్చు.
* టూర్ బడ్జెట్
ప్రయాణానికి ఎంచుకున్న రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు అవుతుంది. ఒకరికి రోజు ఆహారానికి దాదాపు రూ.400 నుంచి రూ.500 వరకు ఖర్చవుతుంది. హోటల్కు రోజుకు రూ.1200 నుంచి రూ.1800 వరకు ఉంటుంది. ప్రయాణానికి దాదాపు రోజుకు రూ.500 వరకు అవ్వొచ్చు. ఇతర ఖర్చులు రూ.1000 వరకు అవుతాయి.